Saturday, 6 August 2022

దురాచారం

 

`
బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి కుమారుడుగా జన్మించాడు. అతనికి బ్రహ్మదత్త కుమారుడని నామకరణం చేశారు. అతను తక్షశిలకు వెళ్ళి పదహారేళ్ళు నిండే లోపునే వేదాలూ, వేదాంగాలూ, ఉపనిషత్తులూ చదివాడు. అతను విద్య పూర్తిచేసుకుని తిరిగి రాగానే తండ్రి అతనికి యౌవరాజ్యాభిషేకం చేశాడు.


ఆ కాలంలో కాశీరాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు. అనేక జాతరలు చేసేవారు. జాతరలు జరిగినప్పుడల్లా గొర్రెలనూ, మేకలనూ, కోళ్ళనూ దేవతలకు బలి ఇచ్చి, వాటి రక్తం నైవేద్యం పెట్టేవారు. బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలనూ, దురాచారాలనూ చూసి చాలా బాధపడే వాడు. ‘‘నేను రాజునయ్యాక ఈ దురాచారాల నన్నిటినీ అరికడతాను. నేల మీద ఒక్క చుక్క రక్తం రాల్చకుండా చేస్తాను,’’ అని అనుకునేవాడు.

కాశీనగరం వెలుపల ఒక మర్రిచెట్టుండేది. ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదనీ, మొక్కుకున్నవాళ్ళకు ఆ దేవత పిల్లల నిస్తుందనీ, ఇతర కోరికలేవైనా ఉంటే ఈడేర్చుతుందనీ ప్రజలు నమ్మేవాళ్ళు. ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథ మెక్కి ఊరి వెలుపల ఉన్న మర్రిచెట్టు వద్దకు వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూరా అనేకమంది స్ర్తీలూ, పురుషులూ భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నారు. చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి, చెట్టును పూలతో పూజించి, చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు. ఆ తరవాత అతను తన రథమెక్కి నగరంలోకి తిరిగి వెళ్ళిపోయాడు.

అది మొదలు అతను తరుచూ ఆ మర్రిచెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు చేమలపై, క్షుద్రదేవతలపై విశ్వాసం ఉండే మామూలు మనుషుల లాగే చెట్టును పూజిస్తూ, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాసాగాడు. కొంతకాలం ఇలా గడిచాక ముసలి రాజు చనిపోయాడు. బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు. రాజ్యాభిషేకం అయిన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు: ‘‘నేను రాజు నెలా అయ్యానో మీరెవరూ ఎరగరు.

కాని, యువరాజుగా ఉన్న కాలంలో నేను ఊరి బయట ఉండే మర్రి చెట్టును భక్తిశ్రద్ధలతో పూజించి వస్తూ ఉండిన సంగతి మీరెరిగే ఉంటారు. నన్ను రాజును చేసినట్టయితే ఆ మర్రిచెట్టుకు వెయ్యి జీవాలను బలి ఇస్తానని మొక్కుకున్నాను. ఈనాటికి నా కోరిక ఈడేరింది. అన్న మాట ప్రకారం మొక్కు చెల్లించాలి. మర్రిచెట్టుకు తప్పకుండా బలి జరగాలి!’’
ఈ సంగతి వినగానే సభికులంతా పరమానంద భరితులయ్యారు. మంత్రులు, ‘‘మహారాజా, తాము మర్రిచెట్టుకు ఏ జంతువులను బలి ఇస్తామనుకున్నారో సెలవిప్పించండి. వెంటనే అన్ని ఏర్పాట్లూ చేయిస్తాం,’’ అన్నారు.

‘‘నేను బలి ఇస్తానని మొక్కుకున్నది జంతువులను కాదు-దేవతలకు జంతువులను బలి ఇచ్చే మనుషులను. అటువంటివారిని వెయ్యిమందిని తీసుకురండి. నా మొక్కు చెల్లించుకుంటాను. ఈరోజు లగాయతు ఎవరెవరైతే దేవతలకు బలులిస్తారో, వారు మర్రిచెట్టుకు బలి చేయబడతారని దేశమంతటా చాటింపు చేయించండి!,’’ అన్నాడు రాజు.

సభికులు నిర్విణ్ణులైపోయారు. కాని వారు బలులలో నమ్మకం ఉన్నవారే గనక, ఏమీ అనలేకపోయారు. దేశమంతటా చాటింపు జరిగింది. అది మొదలు ఇంద్రజాలం లాగా కాశీరాజ్యంలో జంతుబలులు మటుమాయమయ్యాయి.

--------

















1


2


1 సర్వజ్ఞులు


ఒకసారి ఒక సాధువు, బుద్ధుని దగ్గరకు వచ్చి ''భగవాన్‌! మీరు సర్వజ్ఞులట గదా!'' అని, వినయంగా నమస్కరించాడు.


''అని నేనెప్పుడూ ఎక్కడా చెప్పలేదే! ప్రపంచంలో సర్వజ్ఞులెవరూ ఉండరు'' అని బుద్ధుడు ఈ కథ చెప్పాడు.

వారణాసిని పాలిస్తున్న రాజుకు నలుగురు కుమారులు, వారికి జ్ఞానార్జన పట్ల ఆసక్తి ఉండేది. ఆ రాజ్యంలోని మహారణ్యం మధ్యలో అతి విశాలమైన మోదుగు చెట్టు ఒకటుంది. ఆ చెట్టు గురించి, దాని అందం గురించి, దాని వయస్సు గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అది విన్న రాకుమారులకు దాన్ని చూడాలనే ఉత్సుకత కలిగి తండ్రికి చెప్పారు.

''కుమారులారా! మన రథసారథి ఆ మార్గంలో పోయి వస్తూంటాడు. అత న్ని అడగండి. తీసుకుపోతాడ''న్నాడు. వారు రథసారథి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పారు.

''రాకుమారులారా! ఇప్పుడు కాదు. నేను త్వరలో వెళ్తాను. వెళ్లినప్పుడల్లా నా వెంట మీలో ఒక్కొక్కరినే తీసుకుపోతాను. అందర్నీ ఒకసారి తీసుకుపోవడం క్షేమం కాదు - ఇది రాజాజ్ఞ'' అని చెప్పాడు.

చెప్పినట్టుగానే కొద్ది రోజులకే మొదటివాణ్ణి తీసుకువెళ్లాడు. ఆ సమయానికి చెట్టు ఆకులన్నీ రాల్చి ఉంది. కొన్నాళ్ళకు రెండోవాణ్ణి తీసుకుపోయాడు. ఆ సమయానికి పచ్చటి చిగుళ్లు వేసి చెట్టు నవనవ లాడుతూ ఉంది. మరికొంతకాలానికి మూడోవాణ్ణి వెంటబెట్టుకు వెళ్లాడు. ఆ సమయానికి చెట్టంతా పూలతో నిండి ఉంది. మరికొంత కాలానికి నాలుగోవాణ్ణి తీసుకెళ్లాడు. ఆ సమయానికి ఆ చెట్టు పండ్లతో విరగకాసి ఉంది.

ఒకరోజున వారు నలుగురూ ఒకచోట కూర్చొని తాము చూసిన మోదుగు చెట్టు గురించి మాట్లాడుకుంటున్నారు. పెద్దవాడు - '' సోదరులారా! మోదుగు చెట్టు ఎలా ఉంటుందనుకున్నారు. అది కాలినకట్టెలా నల్లని మోడులతో విస్తరించి ఉంటుంది'' అన్నాడు.

''కాదు సోదరా! అది పచ్చని ఆకులతో మర్రిచెట్టులా గుమ్మటంలా కొండంత ఉంటుంది'' అన్నాడు రెండోవాడు.

''లేదు సోదరా! అది ఎర్రని పూలు గుట్టగాపోసిన పెద్ద రాశిలా ఉంటుంది'' అన్నాడు మూడోవాడు.

''అన్నలారా! ఆగండి! అలా ఉండదు. పండ్లు గుట్టపోసినట్టు ఉంటుంది'' అన్నాడు చివరివాడు.

ఆ నలుగురూ ఎవరు చూసింది వారు చెప్పారు. 'నాదే సరైనది'' అని తగవులు పడ్డారు. తండ్రి దగ్గరకు వె ళ్లి విషయం చెప్పారు. ''కుమారులారా! మీ నలుగురి అభిప్రాయం తప్పు. మీకు తెలిసింది ఆ చెట్టు గురించి కొద్ది జ్ఞానం మాత్రమే. కాబట్టి ''మీకు తెలిసింది సరైనది'' అనే అహం వద్దు. మీరే కాదు... ఏ వ్యక్తీ అయినా జ్ఞానపూర్ణుడు, సర్వజ్ఞుడు కాలేడు. ఈ విషయం ఎరిగితే విజ్ఞత వస్తుంది, అహం నశిస్తుంది'' అని ఆ రాజు కుమారులకు చెప్పాడు.

బుద్ధుడు చెప్పిన ఈ కథ విన్న సాధువుకు సర్వజ్ఞులెవరూ లేరని అర్ధమయింది.

తెలిసింది గోరంత..! తెలియాల్సింది కొండంత..!



తెలిసింది గోరంత..!

తెలియాల్సింది కొండంత..! 

కసారి గౌతమ బుద్ధుడు కోశాంబి అనే గ్రామంలో 'రాగరాగిణి' అనే పేరుగల విహార స్థలంలో ఉన్నాడు. అదే గ్రామంలో బ్రహ్మచారిగా ఉన్న ఓ యువకుడు కొన్ని శాస్త్రాలు చదివి, కొంత పాండిత్యం సముపార్జించాడు. కానీ, ఆ పుస్తక పాండిత్యం వల్ల అతనిలో అహం పెరిగిందే కానీ, తరగలేదు. పాండిత్యంలో తనసాటి వారు లేనే లేరంటూ విర్రవీగడం కూడా ఎక్కువయ్యింది. అతడు మాట్లాడే తీరు చూసి అతడు నిజంగానే పండితుడనుకుని ఎంతో మంది తలవంచి నమస్కరించే వారు." విద్వాన్ సర్వత్ర పూజ్యతే'' అన్నారు కదా అందుకే ఆ మర్యాదలన్నీ అతనికి ద క్కేవి. తనను తాను ఒక మహాజ్ఞాని అనుకుంటూ ఆ యువకుడు అజ్ఞానులను ఉద్ధరించడానికి బోధలు చేయడానికి బయలు దేరాడు.

అయితే, తాను ఎక్కడికి వె ళ్లినా అది రాత్రి అయినా పగలైనా ఒక చేతిలో కాగడా పట్టుకుని బయలుదేరే వాడు. అలా వెళుతూ జనం ఎక్కువగా ఉండే కూడళ్లలో కాసేపు ఆగిపోయే వాడు. పగటి పూట కూడా ఇలా కాగడా పట్టుకుని తిరుగుతారు ఎందుకు అని ఎవరైనా అడిగితే సమాధానంగా, తనలో వెలుగుతున్న జ్ఞాన జ్యోతిని ఈ కాగడా సూచిస్తుందని, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న లోకానికి వెలుగునివ్వడమే తన ధ్యేయమని ధీమాగా చెప్పేవాడు. తనకు తెలిసిన నాలుగు శ్లోకాలేవో వల్లించి, వాటి మీద తనకు తోచిన వ్యాఖ్యానమేదో చేసి సామాన్య జనుల చేత పూజలందుకునే వాడు. 

అయితే కోశాంబి ప్రజలు గౌతమ బుద్ధుని ఘనత గూర్చి మాట్లాడుకోవడం కొన్నిసార్లు అతని చెవిన పడింది. బుద్ధుని ఘనత ఏపాటిదో తెలుసుకుందామని ఒకసారి ఆయన వద్దకు వెళ్లాడు. బుద్ధునితో పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించాడు. చర్చిస్తున్న కొద్దీ తనకు తెలిసింది ఎంత స్పల్పమో స్పష్టంగా తె లియసాగింది. చివరకు తన చేతిలోని కాగడాను దూరంగా విసిరేసి, అసలైన జ్ఞానం కోసం బుద్ధుని శిష్యునిగా మారిపోయాడు.

విద్వాంసుడంటే....

మరో సందర్భంలో గౌతమ బుద్ధుడు రాజగృహ నగర సమీపంలోని వెదురు వనంలో ఉన్నప్పుడు మగధరాజు ఆస్థానంలో ఉన్న వస్సరుడు అనే పండితుడు ఆయన్ను కలిశాడు. బుద్ధుడికి నమస్కరించి, భగవాన్! విద్వాంసుడంటే ఎవరో వివరించండి అంటూ, మా ప్రదేశంలో ఒక మహామేధావిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఏది విన్నా, వెంటనే అర్థం చేసుకుని, దాన్ని ఇతరులకు కూడా చక్కగా వివరించగలడు.

అతనికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే. ఎన్నో ఏళ్లక్రితం నాటి విషయాలను కూడా ఉన్నదున్నట్లుగా చెప్పగలడు. తన వృత్తిలోనూ ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి, గౌరవ బిరుదులను, ధన,కనక, వస్తు, వాహనాలను పొందుతాడు. అలాంటి వ్యక్తిని విద్వాంసుడు అనడం సముచితమా కాదా అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా బుద్ధుడు, విద్వాంసునిలో కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా మనసును ఎక్కడ నిలపాలని భావిస్తాడో, అక్కడ నిలబెడతాడు. మనసు ఏవైపు వెళ్లకూడదని భావిస్తాడో ఆ వైపు వెళ్లనివ్వడు.

ఏది అనుసరణీయమని తనకు అనిపిస్తుందో దాన్నే అనుసరిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏది అనుసరణీయం కాదని తాను భావిస్తాడో దాన్ని లోకమంతా ప్రశంసించినా, తనను ప్రేరేపించినా తాను అనుసరించడు. తాను ఎప్పుడు తలిస్తే అప్పుడు ధ్యాన సమాధి పొందగలడు.బంధాలన్నీ తెంచుకుని ఇప్పుడే ఇక్కడే బంధనాల నుంచి విముక్తి పొందే జ్ఞానాన్ని పొందుతాడు. ప్రజ్ఞ అనే ఆయుధాన్ని వినియోగించి చిత్తవృత్తిని నశింపచేసి విముక్తిని పొందుతాడు. ఈ యోగ్యతలు ఉన్న వారినే విద్వాంసులు అంటారు అంటూ బుద్దుదు వస్సరుని సందేహాన్ని నివృత్తి చేశాడు.

ఆయనది ప్రేమ ప్రవాహం...


మగథ సామ్రాజ్య రాజధాని రాజగృహ సమీపంలో గృధ్రకూట పర్వతాలకు అటువైపు ఒక గ్రామంలో దాదాపు డెబ్బై బ్రాహ్మణ కుటుంబాలుండేవి. ముఫ్పై తరాలుగా వారు అక్కడ జీవిస్తూ ఉండేవారు. వారి వృత్తి పశుపోషణ. వారికి ధర్మాన్ని బోధించదలచి బుద్ధుడు వారి గ్రామాన్ని చేరి ఒక చెట్టు కింద కూర్చొన్నాడు. చక్కెర ఉన్న తావుకు చీమలెలా చేరునో అలా చేరారు బ్రాహ్మణులంతా ఆ స్థలానికి. తేజోవంతమైన శరీరం, ప్రశాంత వదనం గల బుద్ధునితో మాట్లాడటం మొదలెట్టారు.

ఆయన చల్లని చూపులు, తియ్యటి మాటలు వారి చీకట్లను తొలగించాయి. సత్యధర్మం వారికి అవగతమయింది. "బుద్ధం శరణం గచ్ఛామి''అన్నారు ప్రతివారు. శ్రావస్తికి తూర్పు వైపు ఉత్తరావతి అను గ్రామంలో ఐదువందల బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారందరూ ఒకసారి నిర్గంధుడనే సాధువు గంగానది తీరంలో ఉన్నాడని, ఒళ్లంతా బురద పూసుకొని సాధన చేస్తుంటాడని విని ఆయన్ను దర్శించ టానికి బయలుదేరుతారు.

మార్గమధ్యంలో వారికి విపరీతమైన దాహం వేసింది. ఆకలి కలిగింది. ఒక అపరిచిత వ్యక్తి తారసపడి వారి ఆకలిదప్పులను తీర్చాడు. గౌతమబుద్ధుని గూర్చి వారికి చెప్పాడు. వారంతా గంగా నది వైపు కాక శ్రావస్తికి వెళ్లి బుద్ధుని దర్శించారు. ధర్మబోధ చేయమని వేడుకున్నారు. వారి జిజ్ఞాసను గమనించిన బుద్ధుడు వారితో "తలవెంట్రుకలు విస్తారంగా పెంచుకొన్నా, గుండు చేయించుకున్నా, కాషాయ వస్త్రాలు ధరించినా, దిగంబరిగా ఉన్నా ఆలోచనలో మంచితనం లోపిస్తే ప్రయోజనం సున్నా. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టక, హత్యలకు పాల్పడక, యజ్ఞయాగాదుల పేరుతో ప్రాణాలను బలిచేయక, స్వార్థచింతన వీడి పరోపకారార్థ«ం జీవించేవాడు ధన్యుడు.

సత్కార్యాల పట్ల ఆసక్తి చూపి వృద్ధులకు సేవ చేసే వారికి సౌందర్యం, బలం, శక్తి, శాంతి లభిస్తాయి. '' అని చెప్పాడు. వారి అజ్ఞానాన్ని తొలగించాడు. వారందరూ "బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి'' అన్నారు ముక్తకంఠంతో. వారి హృదయాల్లో ఆనందం ఉప్పొంగింది. క్షురకుడైన ఉపాలి, వీధులూడ్చే సునీతుడు, అస్పృశ్యులైన స్వపాక, సుప్రియులు, వ్యవసాయదారుడైన సుమంగళుడు కుష్టు రోగి అయిన సుప్రబుద్ధుడు, పరమ దుర్మార్గుడైన అంగుళీమాలుడు, స్త్రీలైన మహా ప్రజాప, యశోదర, చండాలిక యైన ప్రకృతి, ఆమ్రపాలి- ఇలా అన్ని వర్గాల వారు గౌతమబుద్ధుని ప్రేమ ప్రవాహంలో, జ్ఞాన ప్రవాహంలో తేలిపోయారు. ప్రతినోటా వినపడింది...

బుద్ధం శరణం గచ్ఛామి...
ధర్మం శరణం గచ్ఛామి...
సంఘం శరణం గచ్ఛామి.
- రాచమడుగు శ్రీనివాసులు





---------------------------------------------------------------------------------------------------------------


బుద్ధుని ధర్మం యొక్క మౌలిక ప్రబోధం-సమత. క్షురక వృత్తి చేసే ఉపాలి, పారిశుద్ధ్య వృత్తి నిర్వహించే సునీతుడు, అంటరాని వారిగా సమాజం పరిగణించిన సుప్పియుడు, సోషకుడు, సుప్రబుద్ధుడు అనే కుష్టురోగి, ఘోరపాతకుడైన
అంగుళీమాలుడు, నగర వేశ్య అమ్రపాలి, కులీనులు-సామ్రాట్టులు అందరూ బౌద్ధ ధర్మంలో సమానులే.


-------------------------------------------------------------------------------------------------------------------

బౌద్ధవాణి



 

బౌద్ధవాణి కృష్ణవేణి

బౌద్ధవాణి కృష్ణవేణి


కృష్ణానది చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు 400 కోట్ల సంవత్సరాల నాటిది. అప్పటికింకా హిమాలయాలే పుట్టలేదు. కాబట్టి గంగా, సింధూ నదుల ఊసే ఉండదు. సూర్య కుటుంబంలో భూమి పుట్టిన వందల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడ్డ గోండ్వానా భూభాగంలో మన దక్కను పీఠభూమి కూడా ఉంది. అప్పుడు జరిగిన అగ్నిపర్వత చర్యల వల్ల ఎగజిమ్మిన లావా నుండి ఏర్పడినదే ఈ పీఠభూమి. అందుకే ఇది నల్లరేగడి నేల అయ్యింది.

 

ఈ నల్లరేగడి నేల పాయ నల్లమల అడవులు దాటి గుంటూరు జిల్లాలో ఇటు అమరావతి నుండి, అటు ప్రకాశం జిల్లాలో మోటుపల్లి వరకు విస్తరించి ఉంది. ఈ నేలలో ప్రవహించినదే కృష్ణానది. నల్లటి నేలలో ప్రవహించడం వల్ల ఈ నది నీరు కాస్త నూనెరంగులో కనిపిస్తాయి. గంగా, గోదావరి నదుల్లా బురదగా ఉండవు. అందుకే ఈ నదిని నల్లనది అని, నల్లయేరు అని, తేలవాహనం అనీ, కృష్ణానది అనీ అంటారు.

 

కృష్ణానది అతి పురాతన నది కాబట్టి, దీని పరివాహక ప్రాంతం నల్ల రేగడి నేల కాబట్టి, ఆ నేల పీఠభూమి కాబట్టి ఇక్కడ వరి పంటతో పాటు మెట్టపంటలు ఇబ్బడి ముబ్బడిగా పండుతాయి. అందుకే ఈ తీరం అపరాలు, వాణిజ్యపంటల క్షేత్రంగా మారింది. సర్వపంటల సమాహారంగా రూపొందింది. అందుకే అతి పురాతన కాలం నుండి మానవజాతులకు నిలయంగా మారడమే గాక, ప్రపంచంలో అతి ప్రధాన విదేశీ వ్యాపార కేంద్రంగానూ వర్ధిల్లింది. అలా వ్యవసాయం, వ్యాపారాలలోనే కాకుండా ధార్మికంగా కూడా దివ్యత్వాన్ని సంపాదించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నదీ తీరం బుద్ధుని ధర్మప్రబోధలు మారుమోగిన ధరణీ తలం.

 

బౌద్ధ సాహిత్యంలో...

బౌద్ధ సాహిత్యంలో కృష్ణానది ప్రస్తావన అనేక చోట్ల కనిపిస్తుంది. ఎందరో వ్యాపారులు తేలివాహన నదీతీరంలోని ఆంధ్రనగరికి వచ్చిన సందర్భాలు కనిపిస్తాయి. ఆ ఆంధ్రనగరే... ఈనాటి అమరావతి. ఆ తేలివాహన (తైలవాహనం) నదే కృష్ణానది. కర్నూలు, శ్రీశైలం, విజయపురి (నాగార్జునసాగర్), అమరావతి, భట్టిప్రోలు, ఘంటసాల - ఇలా ఈ తీరం వెంట వెలసిన బౌద్ధనగరాలు.

వీటిలో ఒక్కొక్క ఘన చరిత్ర ఉంది. ఇవన్నీ అశోకునికి ముందే ఏర్పడ్డ మహానగరాలు. కర్నూలు జిల్లా ‘ఎర్రగుడి’లో దొరికిన అశోక శాసనాలను బట్టి ఈ ప్రాంతంలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పవచ్చు. అశోకుడు వేయించిన శాసనాలన్నీ ‘ఎర్రగుడి’లో ఉన్నాయి. ఇంకా సాతానికోట, రాజుల మందగిరి, అహోబిలం ఇవన్నీ ఒకనాటి బౌద్ధ క్షేత్రాలే.

 
విజయపురి- బోధిసిరి

విజయపురి (నాగార్జున కొండ) ప్రాంతం సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇప్పుడున్న నాగార్జున కొండను గతంలో నందికొండ అనేవారు. అంతకు పూర్వం శ్రీపర్వతం అనేవారు. ఆచార్య నాగార్జునుని కాలంలో ఇక్కడ విరాజిల్లిన బౌద్ధారామం శ్రీపర్వత ఆరామం. ఈ ఆరామంలో దేశ విదేశ భిక్షువులకు ఆరామాలు, వసతి గృహాలు కట్టించిన ధార్మికురాలు బోధిసిరి. ఈమె ఒక వ్యాపారి భార్య. ఇక్కడ ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. 14 దేశాల విద్యార్థులతో కళకళలాడేది. ఈనాడు ఈ విద్యాలయ ఆనవాళ్లు గుంటూరు వైపునున్న ‘అనుపు’లో చూడవచ్చు.

 

ఆంధ్రనగరి- అమరావతి

ఈనాడు మనం ‘అమరావతి’గా పిలుచుకునే ఊరి ప్రక్కనే ఒకనాడు ఒక మహానగరం ఉండేది. అదే బౌద్ధ జాతక కథల్లో వర్ణించిన ‘ఆంధ్రనగరి’. దీనికి ధనకటక, ధాన్యకటక, ధరణికోట... ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. బౌద్ధుల గీతాల్ని ‘ధారణులు’ అంటారు. ‘ధారణులు’ మారుమ్రోగే క్షేత్రం కాబట్టి దీనికి ‘ధారణికోట’ అంటారనీ, అదే కాలక్రమంలో ధరణికోటగా మారిందనీ అంటారు. ఇక్కడ బౌద్ధ సాహిత్యం ‘త్రిపిటకాల’ బోధన జరిగేది. ఈ ‘పిటకాల’ పేరుతో దీన్ని ‘పేట’ అని పిలిచేవారు. ఈ కోట, పేటలే ఈనాడి అమరావతి.

 

చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు ఇది దక్షిణ భారత దేశ రాజధానిగా విలసిల్లింది. ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మహాస్థూపం భారతదేశంలోనే అతి ఎత్తై స్థూపాల్లో ఒకటి. ‘అమరావతి’ నగరానికి బౌద్ధ సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధంలోని మహాయాన సంప్రదాయానికీ, ఆ తర్వాత వచ్చిన వజ్రయాన (కాలచక్ర) సంప్రదాయానికీ అమరావతే జన్మస్థానం. అమరావతి చుట్టూ చైత్యక, పూర్వ శైలీయ, అపరశైలీయ లాంటి ఎన్నో బౌద్ధ సంప్రదాయాలు వెలిశాయి. ఇది ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. ఆయన తన శూన్యవాదాన్ని ప్రవచించిన తీరం. బౌద్ధం తొలిగా ఈ తీరం వెంబడి సాగి విదేశాలకు ప్రయాణం చేసింది.

 

భౌగోళిక సానుకూలతల వల్ల ఇది గొప్ప వ్యాపారనగరంగా, రాజధాని నగరంగా వందల ఏళ్లు మనగలిగింది. వ్యాపారులు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించారు కాబట్టి వారి ద్వారా తెలుగు భిక్షువులు విదేశాలకు వెళ్లారు. వారి వల్లే బౌద్ధం ప్రపంచ వ్యాపితం అయ్యింది.

 

ఇక శిల్పకళలో కూడా అమరావతికి ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధ శిల్పకళారీతులు మూడు. గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ. ఈ మూడింటిలో అందమైన శిల్పకళ అమరావతి శిల్పకళే. ఈనాడు ప్రపంచ వ్యాపితంగా ఉన్న బౌద్ధ చైత్యాలన్నింటిలో కన్పించే శిల్పకళ ఇదే!

 

తొలి ఆనవాలు భట్టిప్రోలు

కృష్ణాతీరంలో చెప్పుకోదగ్గ అతి పురాతన బౌద్ధక్షేత్రం భట్టిప్రోలు. కృష్ణానదికి పశ్చిమ తీరాన ఉన్న భట్టిప్రోలు భారత దేశంలోని అతి పురాతన చైత్యాల్లో ఒకటి. ఇది అశోకుని కాలం నాటి కంటే ముందరిదే అని అంటారు. అందుకే ఈ భట్టిప్రోలు బౌద్ధం తొలి ఆనవాలు. ఇది కృష్ణానది సముద్రంలో కలిసే చోటుకు దగ్గరగా ఉంది. ఇక్కడి నుండి విదేశాలకు వస్త్రాల ఎగుమతి జరిగేది. భట్టిప్రోలుని ‘ప్రిటుండ్ర’ నగరం అనేవారు. ఈ పదానికి ‘నేత పని’ అని అర్థం. ఇప్పటికీ రేపల్లె ప్రక్కన ‘పేటేరు’ అనే ఊరు ఉంది. అది ఈనాటికీ వస్త్రాల తయారీకి ముఖ్య ప్రదేశమే.

 

భట్టిప్రోలులో ‘సింహ గోష్ఠి’ అనే బౌద్ధ పండితుల సంఘం ఉండేది. ఇది కూడా గొప్ప విద్యాకేంద్రంగా విరాజిల్లింది. ఈ ప్రాంతంలో తగవులు జరిగినప్పుడు లేదా లావాదేవీలు జరిగినప్పుడు మధ్యవర్తులు చేసే ఒప్పందాన్ని ‘భట్టిప్రోలు పంచాయతీ’ అంటారు. ఇరువర్గాలకీ మధ్యస్థంగా సమస్యను పరిష్కరిస్తారు. మధ్యస్థం అనేది బౌద్ధుల ‘మధ్యమ మార్గం’. ఇలాంటి మధ్యవర్తిత్త్వాల్ని ‘మధ్యమ మార్గం’ అనీ ‘భట్టిప్రోలు పంచాయతీ’ అనీ పిలిచేవారు. దీన్నిబట్టి బౌద్ధం ఈ ప్రాంతంలో ఎంతగా వేళ్లూనుకుందో అర్థం అవుతుంది.

 

కంటకశైలే ఘంటసాల

కృష్ణానదికి తూర్పున ఘంటసాల ఉంది. బుద్ధుని గుర్రం ‘కంటకం’. దాని పేరు మీద ఇక్కడ బౌద్ధారామం పేరు ‘కంటకశైల’గా వచ్చింది. ఈ కంటకశైల ఆరామం పేరే క్రమేపీ ‘ఘంటసాల’గా మారింది. కృష్ణానది ముఖద్వార సమీపంలో ఉన్న ఈ నగరం ఒకనాటి గొప్ప వ్యాపార కేంద్రం.

గొప్ప నౌకా కేంద్రం. ఆనాటి నావికుల్లో ఎక్కువమంది ఘంటసాలలోనే ఉండేవారు. ఒక మహానావికుడి భార్య ఘంటసాల స్థూపాన్ని నిర్మించడంలో ఎక్కువ ఆర్థికసాయం అందించింది. గ్రీకు పరిశోధకుడు టాలమీ కూడా ఇది గొప్ప వ్యాపార కేంద్రం అని రాశాడు. ఇక్కడికి సమీపంలో ఉన్న మైసోలియా (మచిలీపట్నం)ని కూడా నౌకా కేంద్రంగానే అభివర్ణించాడు. ఇక్కడ స్థూపం, ఆరామాల శిథిలాలు అనేకం బయట పడ్డాయి. ఇవేగాక గుడివాడ, జగ్గయ్యపేట, మొగలిరాజపురం, సీతానగరం, గుమ్మడి దుర్ర, కంచికచర్ల.. ఇలాంటి బౌద్ధ క్షేత్రాలు కృష్ణా తీరం వెంటే ఎన్నెన్నో ఉన్నాయి. ఇటీవల మరెన్నో క్షేత్రాలు బయట పడుతున్నాయి.


ఈ తీరం అమరావతి శిల్పకళకి, మహాయాన సంప్రదాయానికీ, వజ్రయాన బౌద్ధ మార్గానికీ, విద్యా వికాసమంతా ఆంధ్రదేశంలో జరిగితే అందునా కృష్ణా తీరమే ప్రధాన కేంద్రం అయింది. అందుకే...

 కృష్ణా తీరం గట్లు బౌద్ధ ధమ్మానికి మెట్లు!

 కృష్ణవేణి జీవజలాలు బుద్ధ ప్రబోధ ఫలాలు!!

    - డా. బొర్రా గోవర్ధన్

 

 బౌద్ధ తాత్విక దిగ్గజాలు

తెలుగు బౌద్ధ తాత్విక దిగ్గజాలు ఏడుగురిలో నలుగురు కృష్ణాతీరం వారే.

నాగార్జునుడు (క్రీ.శ. 100-200): రెండో బుద్ధుడుగా కీర్తిగాంచిన తాత్వికుడు నాగార్జునుడు. ఈయన జన్మస్థలం ‘వేదలి’ అని ‘లంకావారసూత్ర’ అనే గ్రంథంలో ఉంది. ఈ వేదలి గుంటూరు జిల్లాలోని బాపట్ల, పొన్నూరు మధ్యన ఉన్న ‘యాజలి’ అని ప్రముఖ పురావస్తు పరిశోధకులు, స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారి అభిప్రాయం. అయితే ఈ విషయం ఇంకా రుజువు కావాల్సి ఉంది.

ఆర్యదేవుడు (క్రీ.శ. 170-270): ఆచార్య నాగార్జునుని శిష్యుడు. బౌద్ధ మాధ్యమిక వాదంలో మహా దార్శనికుడు. పొన్నూరు ప్రాంతం వాడని అంటారు. చతుశ్శతక, శతశాస్త్ర, చతుహస్తిక, అక్షర శతక అనే గ్రంథాలు రాశాడు.

భావవివేకుడు (క్రీ.శ. 490-570): అమరావతికి నైరుతి దిశలోఉన్న ఒక గుహలో నివసించాడు (ఉండవల్లి). కొందరు భావవివేకుణ్ని నాగార్జునుని శిష్యుడే అంటారు. ఇతని జన్మస్థలం మలయగిరి అంటే ఈనాటి మంగళగిరి.

బుద్ధఘోషుడు (క్రీ.శ. 5వ శతాబ్దం): బుద్ధఘోషుడి జన్మస్థలం ‘మొరంద ఖేతకం’ అంటే మయూరపట్టణం. అదే ఈనాడు గుంటూరు జిల్లాలో ఉన్న కోటనెమలిపురం. వీరుకాక మరో జగద్విఖ్యాత బౌద్ధ భిక్షువు బోధిధమ్ముడు. ఈయన అమరావతి నివాసి అంటారు. ఇక్కడి నుంచి కాంచీపురానికి వెళ్లాడు. అక్కడ వ్యాపారులతో (సార్ధవాహులతో) కలసి చైనా చేరి అక్కడ బౌద్ధంతోపాటు మార్షల్ ఆర్ట్స్ ప్రచారం చేశాడు.

నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయటపడిన బౌద్ధావశేషాలను జలాశయం మధ్యలో కొండపై నిర్మించిన మ్యూజియంలో భద్రపరిచారు. దీనికి బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేరు పెట్టారు. ఇది నాగార్జునకొండగా ప్రసిద్ధి పొందింది.

కృష్ణా పరివాహక రాష్ట్రాలు నిర్మించుకున్న  ప్రాజెక్ట్‌లలో ముఖ్యమైనవి... 1. కర్ణాటక: ఆల్మట్టి ప్రాజెక్ట్, నారాయణపూర్ ప్రాజెక్ట్ 2. తెలంగాణ: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 3. ఆంధ్రప్రదేశ్: శ్రీశైలం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్ట్.

-----------------------------------------------------------

బుద్ధుడు-బౌద్ధ మతం


బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి – మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.”బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధుని పైనా, ఆయన సామాజిక కార్యాచరణ పైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. దేశదేశాల సామాజిక పరిశోధకులు, శాస్త్రవేత్తలు వందలాదిగా పరిశోధనా గ్రంథాలను వెలువరించారు. మన దేశంలో దామోదర్ ధర్మానంద్ కోశాంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్, బి.ఆర్. అంబేడ్కర్, రొమిల్లా థాపర్ లాంటి వాళ్లు వారిలో ముఖ్యులు.


క్రీ.పూ. 566లో సిద్ధార్థుడుగా జన్మించిన గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 485 వరకు జీవించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. బుద్ధుడు అత్యంత నిర్మొహమాటంగా యజ్ఞ, యాగాలను నిరసించాడు. అవి ఆగిపోవడానికి ఆయన చాలా శ్రమించాడు. ఎవరి నుంచీ ఏ వస్తువునూ బలవంతంగా తీసుకోరాదాని చెప్పాడు.ఇది కూడా చాలా ముఖ్యమైనది. వైదిక వర్గం స్వర్గం, నరకం, పునర్జన్మ, పాపకర్మల పేరిట కానుకలను తీసుకోవడాన్నిఇది నిరోధించింది. బుద్ధుడు ప్రత్యామ్నాయ ఆచరణను రూపొందించారు. బౌద్ధాన్ని ఆచరించే భిక్షువులు ప్రజలు ఏది ఇస్తే అదే తినాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖరీదైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు తీసుకోరాదని నిబంధన విధించారు.వైదిక వర్గం పట్ల అయిష్టం కలిగిన ప్రజలకు సహజంగానే బౌద్ధం పట్ల గౌరవాదరాలు పెరిగాయి.లైంగిక అసభ్య కార్యకలాపాలకు పాల్పడకూడదని బుద్ధుడు ప్రబోధించారు.నాటి వైదిక వర్గం దేవుడి పేరుతో, మహిమల పేరుతో ప్రజల అజ్ఞానాన్ని సొమ్ముచేసుకొని తమ ఉనికిని సుస్థిరం చేసుకోవాలని చూసింది.బుద్ధుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు.

ప్రజలు శక్తివంతులని, వాళ్ల భవిష్యత్తుని వాళ్లే నిర్మించుకుంటారని, అందుకు దేవుడి లాంటి అతీత శక్తులు కారకులు కాదని చాలా ఖరాఖండిగా చెప్పాడు.మద్యం లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండమని కూడా చెప్పాడు. కుల అసమానతలను కూడా బుద్ధుడు వ్యతిరేకించాడు.గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు “మహాయాన సూత్రాలు” అనే రచనను విశ్వసిస్తారు.

బుద్ధుడు సమాజాన్ని ఒక అవగాహనతో జీవించే సహజీవనాన్ని అందుకు సంబంధించిన సూత్రాలను, ఆచరణలను ప్రవచించాడు. ద్వేషం ద్వేషంతో చల్లారదు. అది ప్రేమతోనే సాధ్యం అన్నాడు. వ్యక్తి తన జీవితంలో నిరాడంబరంగా ఉండాలని, సంపద కూడబెట్టడం ద్వారా స్వార్థం పెరుగుతున్నదని, రేపటి గురించి కాకుండా నేటి గురించి ఆలోచించాలని చెబుతూ వచ్చాడు.బౌద్ధం భారతదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అనేక దేశాల్లో మొదటి మతంగా చాలా దేశాల్లో రెండు, మూడు స్థానాల్లో ఉంది.తత్వశాస్త్రానికి మౌలికసూత్రం మనిషికి మరో మనిషికి, మనిషికి – సంఘానికి, మనిషికి – ప్రకృతికి ఉండే అంతస్సంబధాలను పెంచుకోవడమే. ఈ అంశాలన్నిటి పట్ల బౌద్ధం చాలా తీవ్రంగా పనిచేసింది. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించే దృక్పథాన్ని రూపొందించింది.

హిందూమతం హింసతో జంతుబలులు చేస్తూ యజ్ఞయాగాదులు జరుపుతూ ఉన్న రోజులలో బౌద్ధం పుట్టింది. అహింసావాదం ప్రచారం చేసింది. సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులు పోవాలన్నది, స్త్రీపురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది బౌద్ధం బోధించింది. ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు. ఆదరించారు. అనుసరించారు.తెలివిగా బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు.దేవుడు అనే భావనను దూరం పెట్టిన బుద్దుడినే దేవుడిగా మార్చారు . కాని బుద్ధుడి భావాలు అమలుపరచలేదు. సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. కాని బౌద్ధాన్ని పారద్రోలగలిగారు.క్రీ.పూ. 6 వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు, అంతకు కొంచం ముందుగా జైన మహావీరుడు, ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించి, అట్టడుగు వర్గాలకు ఈ వేదమత దోపిడీనుండి విముక్తిని చూపించారు. దానితో, వేద మతం దాదాపుగా కనుమరుగైపోయి, బౌద్ధ, జైనాలు పూర్తిగా భారత దేశం అంతటా విస్తరించాయి. బుద్ధుడు భౌతిక వాది. సృష్టికర్త అనేవాడు లేడనీ, దైవ ఆరాధన నిరుపయోగమనీ, కోరికలే అన్ని కష్టాలకూ కారణమనీ ఆయన బోధించాడు. అయితే బుద్ధుడు చనిపోయిన తరువాత దాదాపు 400 ఏళ్ళలో, మహాయాన బౌద్ధం ప్రాముఖ్యత సంతరించుకున్న తరువాత బుద్ధుని భగవత్‌ స్వరూపునిగా పూజించటం ప్రారంభం అయ్యింది.

బుద్ధుని జన్మస్థలం లుంబినీ వనం. క్రీ.పూ. 563వ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ రోజున అతడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. బుద్ధుడు జన్మించిన వెంటనే తల్లి మరణించడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి అతడిని పెంచింది.దీనికి కృతజ్ఞతగానే సిద్ధార్థుడు గౌతముడిగా పిలుపించుకున్నాడు.చిన్న వయసులోనే యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే రాహులుడు. సిద్ధార్థుని సవతి తల్లి కుమారుడు దేవదత్తుడు. సిద్ధార్థుని జీవితంలో సంభవించిన నాలుగు సంఘటనలు అతడికి ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తిని కలిగించాయి.ఒకసారి వృద్ధుడ్ని, రోగిని, శవాన్ని, యతిని చూచి భౌతిక జీవనం పట్ల విరక్తి కలిగింది . శాశ్వతమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమార్థాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఇల్లు విడిచి పెట్టాడు.ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం బుద్ధగయలో ఉన్న బోధి వృక్షం కింద తపస్సుచేసి జ్ఞానోదయాన్ని పొందాడు.ఈ క్రమంలో అతడు గౌతమ సిద్ధార్థుడు కాస్తా గౌతమ బుద్ధుడయ్యాడు. దీనినే ‘మహాసంబోధి’అని పిలవడం జరుగుతోంది. ఆ కారణంగా ప్రస్తుతమున్న రావివృక్షం (బోధి వృక్షం) బౌద్ధులందరికీ ఆరాధ్య వృక్షరాజమైంది.

బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను ప్రవచించాడు.దుఃఖము, దుఃఖ సముదయము, దుఃఖనిరోధము, దుఃఖ నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాల ద్వారా సాధించాలి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే ఈ ఎనిమిది అంశాలతో బౌద్ధ ధర్మం, మతం ఏర్పడింది. బుద్ధుని ఆశ్రయించిన వారు బౌద్ధులయ్యారు. బుద్ధుని ధర్మాచరణ – సమత అన్నివర్గాల వారిని ఆకర్షించింది. బుద్ధుడు కులవ్యవస్థను నిరాకరించాడు. ధర్మాన్ని, జ్ఞానాన్ని పొందడానికి అందరూ అర్హులేనని ప్రకటించాడు.అన్ని ప్రాంతాలకు పాదచారియై ప్రయాణిస్తూ చెట్లకింద నివాసం ఉంటూ, రోజూ భిక్షాటన చేసి, ఒక పూట మాత్రమే భోజనం చేసి, జీవితాన్ని, ధర్మాన్ని నియమబద్ధంగా నడిపాడు.

నిమ్నవర్గాలకు చెందిన ఉపాలి, సోపాకుడు, సుప్పియుడు, సుమంగలుడు, శకటాలుడు, డంకుడు, పృథక్కుడు తదితరులను తన శిష్యులుగా చేసుకున్నాడు. బుద్ధుడు అహింసను,శాంతిని బోధించాడు.ఒకరోజు ఒక వ్యక్తి  బుద్ధుడి వద్దకు వచ్చి ‘నాకు సంతోషం కావాలి’ అని కోరాడు. అప్పుడు బుద్ధుడు ,”నీ వాక్యంలోని ‘నాకు’ అనే మాటను తొలగించు, అది అహంకారానికి సంకేతం.అలాగే ‘కావాలి’ అనే మాటను తొలగించు. అది కోరికలకు చిహ్నం .అవి తొలగించిన తర్వాత నీకు (అందరికీ) మిగిలేది సంతోషం “అని చెప్పాడు .ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, పక్షుల్ని బోనులో పెట్టి  పెంచుకున్నా అది కూడా హింసే అన్నాడు బుద్ధుడు .చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, బాధపెట్టినా దాన్ని కూడా ‘జీవహింస’ గానే  చెప్పాడు.బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పౌర్ణమికి ప్రాధాన్యత లేదు. బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది.

బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిందీ , ఇల్లు విడిచిందీ, జ్ఞానోదయం పొందిందీ, పరినిర్వాణం పొందిందీ వైశాఖ పూర్ణిమ రోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించిందీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు.ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు.ఇంకా బుద్ధుడు ఇలా చెప్పాడు–“ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే గొప్పది,ఉన్నతమైనది.వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది.బుద్ధుడు నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. మానవజీవితాన్ని అర్థం చేసుకోమనే అందరూ చెప్తారు. చెప్పే విధానాలు మాత్రమే వేరు. ‘దయగా ఉంటే మంచిది’ అని మిగతా సంప్రదాయాలు చెబితే, ‘దయతో ఎలా ఉండాలో’ బౌద్ధం చెబుతుంది. ఎవరి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలో నేర్పుతుంది.బుద్ధుడి కాలం నుంచే స్త్రీలకు ప్రాధాన్యత ఉంది. బుద్ధుడి బంధువైన మహాప్రజాపతి బౌద్ధమతాన్ని అవలంబించింది. అలాగే అశోకుడి కుమార్తె!లోకానికి మార్గదర్శకులుగా ఉండే మహనీయులందరూ నిరాడంబర జీవితాన్నే గడిపారు. స్వంత పనులకోసం మరొకరిపై ఆధారపడటం కూడా బుద్ధుడికి ఇష్టం ఉండేది కాదు. ఓపిక ఉన్నంత వరకు ఎవరి పని వారు చేసుకోవాలని చెప్పేవాడు. ఎనభైఏళ్ల వయసులో కూడా ఆయన పనులను ఆయనే చేసుకునేవాడు. ఆయన భోజనం చేసిన తర్వాత భిక్షాపాత్రను కడగటానికి ఆయన ప్రియశిష్యుడు ఆనందుడు ఎంత అడిగినా ఇచ్చేవాడు కాదు. నేను అన్నం తింటున్నాను గదా నా పాత్రను నేనే కడుక్కోవడం న్యాయం అనేవాడు. బుద్ధుడు స్వయంగా తాను ఆచరిస్తూ, నిరాడంబరత ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెప్పాడు.

ఇతరుల గురించి ఈర్ష్య పడకుండా, తమను తాము మంచివారిగా మలచుకోవాలని, మనకు ఉన్న అతి పెద్ద సంపద అయిన మేధస్సును సక్రమంగా వాడుకోవాలని బౌద్ధం బోధిస్తుంది.అలాగే మానవ అభివృద్ధికి అవసరమైన ఆధ్యాత్మికతను వయసుతో సంబంధం లేకుండా అందరూ అలవరచుకోవాలని  చెబుతుంది.” ఒకసారి శుద్దోధనుడు బుద్ధుడిని కపిలవస్తుకు వచ్చి తన బోధలు వినివించవలసిందిగా కబురుపెట్టాడు.అలాగే బుద్ధుడు తన పరివారంతో కపిలవస్తుకు చేరాడు. తండ్రిని సమీపించి రాహులుడు తనను ఆయన కుమారుడిగా పరిచయం చేసుకొని,ఆయన వారసత్వ సంపదను తనకు అందచేయమని వేడుకున్నాడు.అందుకు బుద్ధుడు చిరునవ్వుతో అంగీకరించి, పక్కనే  ఉన్న ధర్మసేనాపతి సారిపుత్రుణ్ణి పిలిచి,రాహులునికి భిక్షు దీక్ష ఇవ్వమని చెప్పాడు. “ఇదొక ధర్మ సామ్రాజ్యం,ఇదే నా ఆస్తి”అంటూ రాహులుడికి ఒక భిక్షాపాత్రను అందించాడు బుద్ధుడు. అప్పుడు రాహులుడి వయసు ఏడు సంవత్సరాలు.రాహులుడు బౌద్ధమతంలో తొలి బాల బిక్షువుగా మారాడు.బౌద్ధమతంలో బాలభిక్షువుల్ని శ్రామణేరులు అంటారు.ఆ విషయం తెలిసిన  శుద్ధోధనుడు చాలా దు:ఖించాడు.ఆ దు:ఖంతోనే,”ఇక నాకు ఈ రాజ్యం ఎందుకు, నన్నుకూడా నీ సంఘంలో చేర్చుకో!” అని బుద్ధుడిని కోరి అతను కూడా బిక్షువుగా మారాడు . బుద్ధుని సవతి తల్లి గౌతమి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోధర కూడా భిక్షు సంఘంలో చేరారు.

బౌద్ధ ధర్మంలో రాహులుడు ఎంతో నిష్ణాతుడయ్యాడు. బుద్ధుడు అతనికిచ్చిన ప్రబోధాలు బౌద్ధ సారస్వతంలో  ‘రాహులో వాద సుత్త’గా ప్రసిద్ధి చెందాయి . ఆయన ఎక్కువకాలం ఆమ్రరత్న వనంలో జీవించాడు. రాహులుడు ఎప్పుడు మరణించాడో తెలియదు. కానీ, చాలా చిన్నవయసులో యువకునిగా ఉన్నప్పుడే మరణించాడు. పూర్వజన్మలు,మరు జన్మలు లేవన్న బుద్ధుడిని గురించి బౌద్ధ గ్రంధాలలో విచిత్రంగా ‘బుద్ధుని జాతక కధలు’ఎలా వచ్చాయో అంతుబట్టదు.’బుద్ధుని జాతక కధలు’ ప్రకారంగా సిద్ధార్ధ గౌతముడు బుద్ధుడు కాకముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తినట్లు బౌద్ధగ్రంథాలు చెప్పాయి .అయితే ఈ కధలు– మనలో ఉండాల్సిన ప్రేమ, కరుణ, సహనం, మైత్రీభావాల గురించి స్పష్టంగా తెలియచేస్తాయి.

బుద్ధుడు ధర్మప్రచారంలో 80 ఏళ్ళవరకూ జీవించాడు. చివరికి కుశీనగరంలో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. బుద్ధుని బోధనలు దేశ విదేశాల ప్రజలెందరినో ఆలోచింపచేసేలా చేశాయి. ఫలితంగా చాలామంది బౌద్ధం స్వీకరించే విధంగా ప్రేరేపించాయి.భారతదేశానికి బౌద్ధం ఇప్పుడు మరింత అవసరం. అదే విషయాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పదే పదే వివరించారు.పదిమందికి పంచేకొద్దీ తనలో ప్రావీణ్యతను పెంచేది విధ్య.పదిమందిలో మెలిగేకొద్దీ తనలో సంస్కారాన్ని పెంచేది శుద్ది.పదిమందితో తిరిగేకొద్దీ తనలో సమయస్ఫూర్తిని పెంచేది బుద్ది.ఇదంతా కూడా సజ్జనుల సాంగత్యం వలనే సాధ్యపడుతుంది.మీరే ఆలోచించండి!

 

బుద్ధుడి గురించి ప్రముఖులు—

బుద్ధుడు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు– ఆది శంకరాచార్య

దాస్య విమోచన గురించి, దు:ఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.– కారల్‌ మార్క్స్‌

ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా తన బోదనలు చేసింది బౌద్ధమతమే. ఆధునిక, శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉన్నదా అంటే అది బౌద్ధమతమే. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన అందరిలో అత్యంత గొప్పవాడు బుద్ధుడు.– రవీంద్రనాథ్‌ ఠాగోర్‌

శీలం, ప్రజ్ఞల్లో బుద్ధుడు క్రీస్తును కూడా మించిపోయాడు. బెట్రాండ్‌ రస్సెల్‌

ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభైశాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే…ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే.…ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది…. సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమబుద్ధుడు…బుద్ధుడు నా గురువు. – అంబేద్కర్‌

ప్రాణం ఉన్నదేదీ ఏకాంతంగా జీవించదు… తన కోసమే జీవించదు!సంఘం కోసం జీవించేదాన్నే ‘ప్రాణి’అనొచ్చు!

 

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి


------------------------------------------------




Free e-books